జగన్ పై కాంగ్రెస్ ఆర్ధిక దాడి
Telugu Online(TOL)- Andhra Pradesh Political Article - July.24.2010: వైయస్ జగన్ ను కాంగ్రెస్ అధిష్టానం బ్లాక్ మెయిల్ చేస్తోందా.... అవుననే అనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే. రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోని నిర్ణయాలను కాంగ్రెసు అధిష్టానం తిరగదోడుతోంది. వివాదాస్పద నిర్ణయాలను, తన వారికి కోట్లాది రూపాయల ఆదాయాలు సమకూర్చే వనరులను కట్టబెట్టారనే ఆరోపణలున్న అంశాలను తిరగదోడుతూ ప్రభుత్వపరంగా జగన్ అతడి కుటుంబ సభ్యులకు వ్యతిరేకమైన నిర్ణయాలకు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా గనుల లీజు వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.

గనుల లీజు వ్యవహారాలు జగన్ వర్గానికి విశేషంగా సంపదను సమకూర్చిపెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్న దృష్ట్యా ఈ దిశగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. తన బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి గనుల శాఖ మంత్రిగా నియమించడం గనులను కొల్లగొట్టే వ్యూహంలో భాగమేనని అంటున్నారు. వైయస్ నిర్ణయాలను తిరగదోడడం ద్వారా జగన్ ఆర్థిక బలాన్ని నిర్వీర్యం చేయడం, నైతికంగా దెబ్బ తీయడం కాంగ్రెసు అధిష్టానం దూరాలోచనగా తెలుస్తోంది. రోశయ్య ముఖ్యమంత్రి కాగానే దీనికి నాంది పలికారు. కర్నాటక మంత్రి, వైయస్ సన్నిహితుడు అయిన గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనుల అక్రమాలపై కూడా అధిష్ఠానం కన్నేసింది. జనార్దనరెడ్డి గనుల తవ్వకాల్లో వైఎస్ వర్గానికి వాటాలున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దాంతో ఓబుళాపురానికి కాంగ్రెస్ అధిశ్టానం ఆసరాతో ప్రభుత్వం చెక్ పెట్టింది. చీమకుర్తి గ్రానైట్ వ్యవహారంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోందని సమాచారం.
మరోపక్క ఏకపక్షంగా ఉన్న కొదరు అధికారుల్ని కూడా ప్రభుత్వం పక్కన పెట్టింది, తాము వద్దన్నా ఓదార్పు యాత్ర చేస్తున్న తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు షాక్ ఇవ్వాలనే కాంగ్రెసు నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్ కుమార్ కు సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చినందునే బయ్యారం గనుల లీజును ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ఖమ్మం జిల్లా బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో ఇనుప ఖనిజం లీజును నిలుపుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రోశయ్య స్వయంగా ఈ గనుల ఫైళ్ళను పరిశీలిస్తూ, వైఎస్ వర్గీయుడైన గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టారు.ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో కూడా బయ్యారం గనుల అక్రమాలపై విచారణ జరిపిద్దామని ముఖ్యమంత్రి రోశయ్య సూచించారు. అయితే మంత్రులు వ్యతిరేకించారు.