Telugu Online(TOL)- Sports News- July.29.2010:2010 అక్టోబర్లో జరగనున్న ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్కు ఆరుగురు బ్రాండ్ అంబాసిడర్ల పేర్లను కామన్వెల్త్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రకటించింది. ఈ జాబితాలో బ్యాడ్మింటన్ సంచలనం సైనా నెహ్వాల్, ఒలింపిక్ కాంస్య పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బ్రిందా, ఏస్ షూటర్ సమ్రేష్ జంగ్, ఒలింపిక్ కాంస్య పతక విజేత విజయేందర్ కుమార్, మహిళా బాక్సర్ ఎమ్సీ మేరీ కోమ్ లు ఉన్నారు. అక్టోబర్ 3 నుంచి 14 వరకు జరుగనున్న కామన్వెల్త్ క్రీడా కార్యక్రమాలకు వీరు బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతారని సీడబ్ల్యూజీ మంగళవారం తెలిపింది.

1982లో జరిగిన ఏసియన్ గేమ్స్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పేరును ఏఏఐ అధ్యక్షుడు వీకె మల్హోత్రా ప్రతిపాదించగా.. ఆర్గనైజింగ్ కమిటీ ప్రతిపాదనను తిరస్కరించింది. ఢిల్లీ గేమ్స్ కోసం నటుల్ని కాకుండా యువ ఆటగాళ్లను మాత్రమే అంబాసిడర్లుగా నియమించాలని కామన్వెల్త్ గేమ్స్2010 ఛైర్మన్ సురేష్ కల్మాడీ నిర్ణయించి ప్రకటించిన నేపధ్యంలో ఈ మార్పు జరిగింది. ఇదిలా ఉంటే ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో రెండో స్థానం సాధించిన సైనా నెహ్వాల్ను మంగళవారం పార్లమెంట్ అభినందించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించిన సైనా నెహ్వాల్.. భవిష్యత్తులో మరిన్ని టైటిళ్లను గెలవాలని ఆకాంక్షించింది.