Telugu Online(TOL)- India Political News - July.28.2010:నిత్యావసరాల ధరల పెంపుపై పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం దద్ధరిల్లాయి. పెరిగిన ధరలతో దేశ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నాయని, ఈ అంశంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి.యూపీఏ భాగస్వామ్య పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే కూడా ఈ అంశంలో ప్రతిపక్ష పార్టీలతో గొంతు కలిపాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్లు మీరా కుమార్ (లోక్సభ), హమీద్ అన్సారీ (రాజ్యసభ)లు ప్రతిపక్షాల మాటను తోసిపుచ్చి సభను సజావుగా నడిపించేందుకు శతధా ప్రయత్నించి విఫలమయ్యారు.

ప్రతిపక్షాలు పట్టువీడక పోవడంతో ఉభయ సభలను బుధవారానికి వాయిదా వేశారు. సభ ప్రారంభమైన వెంటనే యూపీయే పక్షాలైన ఎస్పీ, ఆర్జేడీలు ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపి ధరలపై చర్చకు డిమాండ్ చేశాయి. నిత్యావసర వస్తు ధరలతో పాటు, పెట్రో వడ్డన, కిరోసిన్, వంటగ్యాస్ ధరలను పెంపుపై చర్చకు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ప్రసంగిస్తూ పెంచిన పెట్రోల్, డీజల్, కిరోసిన్, వంటగ్యాస్ ధరల వల్ల సామాన్య ప్రజానీకం జీవనం దుర్భరమైందన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి దీనిపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయన్నారు. అందువల్ల తమ వాయిదా తీర్మానాలను ఆమోదించి, చర్చకు అనుమతించాలని కోరారు.
ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న భాగస్వామ్య పక్షాలు కూడా చర్చ సాగాలని కోరుతున్నాయని తెలిపారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి బాబ్లీ ప్రాజెక్టు అంశాన్ని లేవనెత్తారు. దీంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ.. విపక్ష సభ్యులు ఏమాత్రం శాంతించకపోవడంతో మర్నాటికి వాయిదా వేస్తూ సభాపతులు నిర్ణయం ప్రకటించారు.